AP Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం మరో 7 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్ల జిల్లాలో 1 కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 9 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు ముగ్గురు కోలుకుని డిశ్చార్జి కాగా, నలుగురు మృతి చెందారు. అయితే మృతులందరికీ కరోనా నిర్ధారణకు ముందే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో విశాఖ జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లను సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి కోవిడ్ ప్రోటోకాల్స్ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

