మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాలు, ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీని ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై తీవ్రంగా పడింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే… నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన భారీ ఐరన్ తూరలు, ఐరన్ పైపులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే స్పిల్ ఛానల్ కింద నిర్మాణ పనుల అవసరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా స్పిల్వేపై ఉన్న ప్రధాన రహదారి ద్వారానే నిర్మాణ సామగ్రి రవాణా, సిబ్బంది రాకపోకలు కొనసాగుతున్నాయి.
డేంజర్ మార్క్ దిశగా నీటిమట్టం..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… ప్రస్తుతం పోలవరం స్పిల్వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరుకుంది. అలాగే ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 26.80 మీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో, రానున్న 24 గంటల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (CWA), స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రాజెక్టు రక్షణకు మరియు సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

