Site icon NTV Telugu

CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!

CM Chandrababu Reviews Diesel Shortage

CM Chandrababu Reviews Diesel Shortage

రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతతో బంకులు మూసేసిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 4,510 బంకుల్లో 10 శాతం బంకులు సరఫరా లేక మూతపడినట్లు తెలిపారు అధికారులు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 అవుట్ లెట్స్ (పెట్రోల్ బంకులు) ఉండగా.. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా.. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని.. అయితే కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు.

శనివారం రోజు 10,345 లీటర్ల పెట్రోల్, 14,156 లీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50 శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని అధికారులు వివరించారు. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా సరఫరా పెరిగినా వినియోగదారులు అనే చోట్ల బారులు తీరి కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్‌లలో కొనుగోళ్లు జరుపుతారని.. వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని అధికారులు తెలిపారు. దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను అదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను అదేశించారు.

Exit mobile version