CM YS Jagan: ఆదాయాన్నిచ్చే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించారు.. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుపై ఆరా తీశారు.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరిన జీఎస్టీ (కాంపెన్సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు, అధికారుల వెల్లడించారు.. జూన్ వరకు రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని సీఎంకు వివరించారు అధికారులు. ఇక, 2018–19తో పోలిస్తే.. మద్యం అమ్మకాలు తగ్గినట్టు చెబుతున్నారు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. 2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు అమ్ముడుపోయాయి.. 2018–19 ఏప్రిల్, మే, జూన్ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్ 56.51 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్ అమ్మకాల్లో మైనస్ 5.28 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని ఈ సందర్భంగా వెల్లడించారు అధికారులు.
అధికారులకు కీలక సూచలను చేశారు సీఎం వైఎస్ జగన్.. నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపాలని స్పష్టం చేశారు.. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా.. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఇక, గతంలో గనులు, ఖనిజాల శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు.. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయని.. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు.. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించాలన్న ఆయన.. ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలన్నారు.
ఇక, గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిన విషయాన్ని సీఎంకు తెలిపారు అధికారులు. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.. గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్ సాధ్యమైందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–19లో ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని తెలిపారు.మరోవైపు.. కార్యకలాపాలను నిర్వహించిన 2724 మైనింగ్ లీజుల్లో 1555 చోట్ల తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మొత్తంగా.. గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. ఈ విభాగాల పరిధిలో ఆదాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతంలో ఆదాయాలపరంగా ఉన్న లీకేజీలను అరికట్టడంతోపాటు, పారదర్శక విధానాలు, సంస్కరణలతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఇక, రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలని సూచించారు.. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని, అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని స్పష్టం చేశారు. వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.