AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీ-ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొని, రాష్ట్రంలో ఆక్వా రంగం ప్రాధాన్యతను, బ్లూ ఎకానమీ ద్వారా సాధించగల ఆర్థిక వృద్ధిని వివరించారు. భవిష్యత్తు అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేసిన ఆయన, ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సముద్రం మీద రాతలా బలంగా సాగాలని ఆకాంక్షించారు.

పెట్టుబడిదారులకు భరోసా..
రాష్ట్రంపై నమ్మకంతో ఇన్నోవేషన్స్‌తో ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు తాను ఎల్లప్పుడూ ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. అలాగే కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ (ఆధునీకరణ) చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేవలం 15 రోజుల్లోనే కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

×
×
Ad

దేశ ఆక్వా రంగంలో ఏపీ తిరుగులేని రారాజు..
భారతదేశ సముద్ర ఆహార రంగంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. దేశంలో సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి జరుగుతోంది. భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో 38 శాతం ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తోంది. దీని ద్వారా రాష్ట్రం నుంచి ఏటా రూ. 28,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి.

అంతర్జాతీయ అవకాశాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్‌లో భారతదేశ వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని, అయితే ఈ రంగంలో దేశానికి ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసి, బ్లూ ఎకానమీని పెంచడం ద్వారా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో మరిన్ని ఆవిష్కరణలు (ఇన్నోవేషన్స్) చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ప్రపంచస్థాయిలో ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.