AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ను రూపొందించింది. ఈ బడ్జెట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలుపగా, అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. రూ.50,000 కోట్ల దాకా నిధులు కేటాయించే అవకాశముంది. ముఖ్యంగా అన్నదాత-సుఖీభవ, పంటల బీమా, వడ్డీ రహిత రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ పామ్ అభివృద్ధి, రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్ జలసిరి, మత్స్యకారులకు భృతి వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన నివాసంలో అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమరావతిలోని వెంకటాయపాలెం టీటీడీ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేసి, రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈసారి మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నూతన పథకాలు, అభివృద్ధి ప్రణాళికలపై మంత్రివర్గ సభ్యులు వివరాలు వెల్లడించనున్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించే అవకాశముందని సమాచారం.