ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో తనపై మరో కేసు నమోదైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. జనవరి 31వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారనే ఆరోపణలతో పోలీసులు తాజాగా తనకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఒకే నేరంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పినప్పటికీ, తనపై ఇలాంటి కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆరోపించారు. “ఇలా కేసులు పెట్టడానికి వాళ్లకైనా సిగ్గుండాలి, నాకైనా ఉండాలి” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే అంశానికి సంబంధించి తనను 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచారని, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై తాను ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పానని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక నారా లోకేష్ హస్తం ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేష్ డైరెక్షన్లోనే ఈ నాటకాలన్నీ నడుస్తున్నాయని విమర్శించారు. ఎస్సైలకు నేరుగా ఫోన్లు చేయించడం, తనకు నోటీసులు ఇప్పించడం వంటి పనులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను జీవితంలో ఎప్పుడూ జైలుకు వెళ్లడానికే భయపడలేదని, ఇక ఈ పోలీసు నోటీసులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజా ఉద్యమాలను, తమ గొంతును అణచివేయాలని చూస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ అక్రమ కేసులన్నీ భవిష్యత్తులో ప్రభుత్వానికే భస్మాసుర హస్తంలా మారుతాయని అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

