Farmers Protest: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ( ANU) దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మూడు ( విశాఖ, కర్నూలు, అమరావతి ) రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) యూనివర్సిటీ దగ్గర ఆందోళనకు దిగారు.
Read Also: Swayambhu: ఏపీ అడవుల బాట పట్టిన ‘స్వయంభు’
ఇక, నాగార్జున యూనివర్సటీ లోపలికి వచ్చేందుకు రాజధాని రైతులు ప్రయత్నం చేయడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వాళ్లు గేట్లు నెట్టుకుంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్లగా.. అమరావతి రైతులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పక్కకు నెట్టేశారు. అయినా కూడా అమరావతి రైతులు వీసీ కార్యాలయానికి తాళం వేసి.. అక్కడే బైఠాయించారు. వెంటనే, వీసీ రాజశేఖర్ తన పోస్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తుండటంతో వర్సిటీకి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. దీంతో నాగార్జున యూనివర్సిటీ దగ్గర పరిస్థితి అదుపులోకి వచ్చింది.