పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ భారీగా సహకారం అందించనుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సహాయాన్ని ప్రకటించారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.
పీ-4 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మన బడి – మన భవిష్యత్ పథకం కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దాతలు ఇచ్చే విరాళాల ఆధారంగా ఆయా పాఠశాలలకు వారి పేర్లు పెట్టుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు త్వరలోనే ‘మన బడి – మన భవిష్యత్’ వెబ్సైట్ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: Sanju Samson Award: సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’పై రచ్చ.. మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు!
అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ విద్యా రంగంతో పాటు ఆరోగ్య, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికీ చేయూత అందిస్తోంది. బోగోలు మండలం కొవ్వూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనుంది. అదేవిధంగా కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం మరో రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ విధంగా విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక రంగాల్లో మొత్తం రూ.15 కోట్ల సహాయం అందించనున్న అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చర్యలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
