Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!

Allu Arjub

Allu Arjub

Allu Arjun Absent: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నటుడు అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఆయన గైర్హాజరుకు సంబంధించి మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించగా, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్‌ను సమర్పించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలా లేదా అన్న అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని సంధ్య థియేటర్ తరఫు న్యాయవాది భాను చందర్ వెల్లడించారు. కేసులోని ఇతర నిందితులు సహా మొత్తం 21 మంది కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగత హాజరు కోసం కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ.. హాజరు కాలేకపోవడానికి గల కారణాలను ఆయన న్యాయవాది కోర్టుకు వివరించారు.

×
×
Ad

మరోవైపు A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని చేర్చిన పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌ లోని సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటనలో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించారు.