NTV Telugu Site icon

AP Elections 2024 Results: కృష్ణా జిల్లాలో కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు.. తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..

Krishna District

Krishna District

AP Elections 2024 Results: కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ వెల్లడించారు.. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం.. ప్రతి నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,39,460 ఓటర్లు ఉండగా.. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి, 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 12,93,948 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు.

ఇక, ప్రతి టేబుల్ కు ఒక అదనపు ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక కౌంటింగ్ అబ్జర్వర్ లను నియమించామన్నారు. రౌండ్ల వారి ఫలితాల ప్రకటన ఉంటుందని.. మచిలీపట్నం అసెంబ్లీ స్థానం ఫలితాలు 15 రౌండ్లు.. పెడన అసెంబ్లీ స్థానానికి 16 రౌండ్లు, గుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలకు 17 రౌండ్లు, అవనిగడ్డ అసెంబ్లీ ఫలితం 20 రౌండ్లు, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలకు 22 రౌండ్లు ఉంటాయని వెల్లడించారు డీకే బాలాజీ.. అయితే, తొలి ఫలితం పెడన, తదుపరి మచిలీపట్నం ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి మొత్తం 21,579 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.. 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 21,728 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి.. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు పామర్రు 2 టేబుల్స్ , పెడన 3 టేబుల్స్ , గన్నవరం 5 టేబుల్స్, గుడివాడ, పెనమలూరు 6 టేబుల్స్ చొప్పున, మచిలీపట్నం, అవనిగడ్డ 8 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాటు చేశాం.. అందులో మూడు సెక్షన్ల కేంద్ర బలగాలు, మూడు సెక్షన్ల రాష్ట్ర సాయుధ దళాలు, రాష్ట్ర సివిల్ పోలీస్ బలగాలతో నిరంతరం పటిష్ట భద్రత ఉంటుందన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం 110 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని.. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు వెళ్లడానికి వేరు వేరు మార్గాలు ఉంటాయని సూచించారు. రౌండ్ వారి ఫలితాలను ప్రకటించేందుకు కమ్యూనికేషన్ రూమ్‌ను, మీడియా కవరేజ్ కోసం మీడియా సెంటర్ ఉంటాయన్నారు. ప్రథమ చికిత్స కోసం వైద్య శిబిరాన్ని కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేశాం.. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. అగ్ని ప్రమాద నివారణకు అగ్నిమాపక శకటాలు, సంబంధిత పరికరాలతో సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు.. ఇక, కౌంటింగ్ సిబ్బంది, మీడియా వారికి కృష్ణ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేశామని.. రుద్రవరం గురుకుల పాఠశాల వద్ద అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలకు పార్కింగ్ ఉంటుందని వెల్లడించారు అధికారులు.