Site icon NTV Telugu

TG Municipal Election Results: ఆ మున్సిపాలిటీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ విజయకేతనం..

Tg

Tg

Telangana Municipal Election Results: తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా ఓ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. 8వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జయశ్రీ విజేతగా తన ప్రత్యర్థిపై 270 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఇప్పటి వరకు ఈ పార్టీ తెలంగాణలో గెలవడం ఇదే మొదటిసారి! ఈ పార్టీ గుర్తు సింహం గుర్తు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ పార్టీ గురించి పూర్తి వివరాలు విషయానికి వస్తే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది భారత జాతీయ కాంగ్రెస్‌లో ఒక వర్గంగా ప్రారంభమై, పశ్చిమ బెంగాల్‌లో బలమైన ఉనికిని కలిగి ఉంది. పార్టీ జెండా ఎర్రగా ఉండి, దూకే పులి చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జి. దేవరాజన్ ఈ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.

READ MORE: Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్‌హోల్.! వీడియో వైరల్..

సుభాష్‌ చంద్రబోస్‌.. ఈ పేరు వినగానే భారత జాతి పులకిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఆరాధన భావం ఉప్పొంగుతుంది. సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్‌ వారిని మన దేశం నుంచి తరమగలమని ప్రకటించారు. ‘‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వేచ్ఛను ఇస్తాను’’ అని యువతలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారు. ‘‘జైహింద్‌’’ నినాదంతో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకుని ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. దేశ ప్రజలంతా ఆయన్ను ‘నేతాజీ’గా పిలుస్తారు. అయితే… 1938లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా బోస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాంధీజీతో విభేదాల కారణంగా కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ‘అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌’ పార్టీని స్థాపించారు. 1940లో ఆ పార్టీ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది.

Exit mobile version