Bangladesh Violence : పొరుగు దేశంలో జరుగుతున్న తాజా హింసాత్మక సంఘటనల దృష్ట్యా బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రావొద్దని భారతదేశం ఆదివారం రాత్రి సూచించింది. అలాగే ఇక్కడ ఉన్న వారు కూడా తదుపరి ఆదేశాల వరకు బంగ్లాదేశ్కు వెళ్లవద్దని భారత్ తన పౌరులను కోరుతూ కొత్త సలహాను జారీ చేసింది. ఆదివారం బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 14 మంది పోలీసులతో సహా దాదాపు 100 మంది మరణించారని ఢాకా నుండి వచ్చిన నివేదికలు తెలిపాయి.
ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బంగ్లాదేశ్కు వెళ్లవద్దని భారతీయ పౌరులు ఖచ్చితంగా సూచిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాలో పేర్కొంది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయట తిరగొద్దని ఢాకాలోని భారత హైకమిషన్తో ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని సూచించారు.
ఇప్పటి వరకు 100 మంది మృతి
ఆదివారం బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అధికార అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో 14 మంది పోలీసులతో సహా 100 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ కారణంగా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, దేశవ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై దుమారం
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యవస్థపై తలెత్తిన గందరగోళంపై ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరసనకారులు వచ్చారు. అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు వారిని వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంపై దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణలు, కాల్పులు, ఎదురుదాడుల్లో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా సాయం కోసం బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషన్ అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలి.
ఢాకా లోని భారత హైకమిషన్ ఫోన్ నంబర్లు
+8801958383679
+8801958383680
+8801937400591