NTV Telugu Site icon

Kalyan Banerjee: వక్ఫ్ బిల్లు సమావేశంలో టీఎంసీ ఎంపీ అత్యుత్సాహం.. సస్పెండ్ చేసిన జేపీసీ ఛైర్మన్

Kalyan Banerjee

Kalyan Banerjee

వక్ఫ్ బిల్లుకు సంబంధించి మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో జరిగిన ఘర్షణ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చర్యలు తీసుకున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ టీఎంసీ ఎంపీని తదుపరి సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. అంటే తదుపరి జేపీసీ సమావేశం ఏది జరిగినా కళ్యాణ్ బెనర్జీని అనుమతి ఉండదు. మంగళవారం జరిగిన జేపీసీ సమావేశంలో కళ్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో కళ్యాణ్ బెనర్జీ గాయపడ్డారు. తీవ్ర వాగ్వివాదం సమయంలో, కళ్యాణ్ బెనర్జీ గ్లాస్ వాటర్ బాటిల్‌ను పగలగొట్టారు. దాని కారణంగా ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. చేతికి నాలుగు కుట్లు కూడా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

READ MORE: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్

ఘర్షణ అనంతరం జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ నేతృత్వంలో రూల్ 374 కింద ఓటింగ్ జరిగింది. ఇందులో కళ్యాణ్ బెనర్జీ సస్పెన్షన్‌కు అనుకూలంగా 9, వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. జేపీసీ నుండే బెనర్జీని సస్పెండ్ చేయాలని అధికార పక్షం సభ్యులు హితవు పలికారు. అయితే చర్చల అనంతరం ఒకరోజు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.

READ MORE:BRICS Summit: పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..

జేపీసీ సమావేశంలో ఏం జరిగింది?
ఈ సమావేశానికి పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, మేధావులు హాజరయ్యారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా కళ్యాణ్ బెనర్జీ లేచి మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో కూడా పలుమార్లు సమావేశంలో మాట్లాడారు. కానీ ఈసారి ఆయన ప్రసంగించే సమయంలో అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం లేవనెత్తారు. దీంతో కళ్యాణ్ బెనర్జీ ఆయనపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. ఇంతలో, వారిద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడారు. కోపంతో, కళ్యాణ్ బెనర్జీ ఒక గాజు సీసాని తీసుకొని టేబుల్‌పై విసిరారు. దాని కారణంగా ఆయన గాయపడ్డారు.