Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?

Telangana Schools Reopening

Telangana Schools Reopening

Telangana School Bandh: తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రభుత్వ స్కూళ్లలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఈరోజు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు సహకరించాల్సిందిగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, కనీస మౌలిక వసతులు లేక ప్రభుత్వ బడులు మూతపడే స్థితికి చేరుతుంటే, సర్కారే పరోక్షంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తోందని ఏబీవీపీ తీవ్రంగా ఆరోపించింది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన చదువును దూరం చేసేలా, కొన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసివేయడానికి సీఎం కుట్ర పన్నుతున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు.

ఈ బంద్ ద్వారా ఏబీవీపీ ప్రధానంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. రేషనలైజేషన్‌ పేరుతో రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించాలి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా సాగుతున్న ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన ‘ఫీజుల నియంత్రణ చట్టాన్ని’ తీసుకురావాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఇక మరోవైపు.. బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు విద్యాసంస్థల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇప్పటికే సెలవులను ప్రకటించాయి.

×
×
Ad