Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు

Cockroach Janta Party

Cockroach Janta Party

Abhijeet Dipke: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేటి నుంచి ఒక భారీ నిరసన ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇందుకోసం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం సుమారు 7:35 గంటలకు అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీలోని ఐజీఐ (IGI) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. తానే స్వయంగా జూన్ 6న భారత్‌కు తిరిగి వచ్చి ఈ శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఈ వారం మొదట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ల్యాండింగ్ అయిన వెంటనే అభిషేక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ లో స్పందిస్తూ.. “ల్యాండింగ్ పూర్తయింది.. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీతో పాటు పుస్తకాన్ని, మన త్రివర్ణ పతాకాన్ని తీసుకురావడం మర్చిపోకండి. పోలీసులకు సానుభూతి, కృతజ్ఞతలకు చిహ్నంగా పూలను బహుకరించండి. ఈ ఉద్యమాన్ని మనం ప్రేమ, శాంతి మార్గాల్లో ముందుకు తీసుకెళ్లాలి” అని పోస్ట్ చేశాడు. కాగా, జూన్ 5వ తేదీ లోగా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయకపోతే తాను సైతం ఈ నిరసనలో పాల్గొంటానని విద్యా సంస్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఇదివరకే ప్రకటించారు.

మరోవైపు, ఈ నిరసన ప్రదర్శన కోసం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ, నిరసనలు జరిగే అవకాశం ఉన్నందున వారు న్యూఢిల్లీ ప్రాంతంలో 1,000 మందికి పైగా పోలీసులతో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనకారులతో ఎలాంటి ఘర్షణలకు దిగకుండా, చర్చల ద్వారానే పరిస్థితిని ప్రశాంతంగా ఉంచాలని పోలీసులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సెంట్రల్ ఢిల్లీని 12 జోన్లుగా విభజించి, ప్రతి జోన్ బాధ్యతను ఒక డీసీపీ (DCP) ర్యాంక్ అధికారికి అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సహా పలువురు మంత్రుల నివాసాల వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని జిల్లాల, యూనిట్ల డీసీపీలను అలర్ట్‌గా ఉండాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నిరసనల కారణంగా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో పాటు, శాంతిభద్రతల సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

×
×
Ad