Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..

Shreyas Iyer

Shreyas Iyer

భారత టీ20 జట్టు నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ ప్రశాంతత, సానుకూల దృక్పథం అతని కెప్టెన్సీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసించారు. జూన్ 2026లో సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభంలో అనుకూల ఫలితాలు రాలేవు. నాయకత్వం చేపట్టిన తొలి తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే లభించినప్పటికీ, జట్టు వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడంలో ఆయన ఎంతో పరిణతి చూపిస్తున్నారని చోప్రా పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడూ ప్రతికూల వ్యాఖ్యలు చేయరని, మనం మాట్లాడే ప్రతి మాట నిజమయ్యే శక్తి కలిగి ఉంటుందనే ‘మానిఫెస్టింగ్’ సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్ముతారని తెలిపారు.

సహజంగానే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుందని, అలాంటి సమయంలో కెప్టెన్ లేదా కోచ్ అదనపు ఒత్తిడి తీసుకురాకుండా ప్లేయర్లను ప్రశాంతంగా ఉంచడం ఎంతో అవసరమని చోప్రా అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ ఎల్లప్పుడూ యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తూ, వారిలోని ఉత్తమ ప్రదర్శనను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.

నిరంతరం అరుపులు, కేకలు వేయకుండా.. ఆటగాళ్లపై భారాన్ని పెంచకుండా మద్దతుగా నిలిచే నాయకుడినే యువ క్రీడాకారులు కోరుకుంటారని, శ్రేయస్ సరిగ్గా అలాంటి కెప్టెన్ అని ఆయన వ్యాఖ్యానించారు. విజయాలు తక్షణమే రాకపోయినా, ప్రశాంతమైన దృక్పథం దీర్ఘకాలంలో జట్టుకు ఎంతో మేలు చేస్తుందని, యువ క్రీడాకారుల మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో శ్రేయస్ మార్గం అభినందనీయమని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ఎంఎస్ ధోని ఎంత కూల్ గా ఉంటారో.. అలాంటి ధోరణి శ్రేయస్ కు కూడా ఉందని కొనియాడారు.