New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..

Airports

Airports

వరంగల్ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ. 496.86 కోట్ల (జీఎస్టీతో సహా) అంచనా వ్యయంతో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రన్‌వే విస్తరణ, ఆప్రాన్, టాక్సీవే వంటి పేవ్‌మెంట్ నిర్మాణాలతో పాటు విమానాశ్రయ రక్షణ కోసం సరిహద్దు గోడ నిర్మాణ పనులకు సంబంధించి ఏఏఐ ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించింది. అయితే, ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చే భూమి, చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు, నిధుల లభ్యత , సైట్ పరిమితులపై ఆధారపడి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణలోని ఇతర జిల్లాలకు విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర, రక్షణ అవసరాల కోసం ‘జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌’గా అభివృద్ధి చేసేందుకు ఏఏఐ టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS)ని పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అదనపు భూమి వివరాలను సేకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసింది.

మరోవైపు పెద్దపల్లిలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి, ఆ స్థలం ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను ఏఏఐ 2026 ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన తదుపరి ప్రక్రియలు పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణలో ప్రాంతీయ విమాన సర్వీసులను మెరుగుపరచడానికి, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఈ కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు ఎంతో కీలకంగా మారనున్నాయి.