NTV Telugu Site icon

Operation: త్రీ ఇడియట్ సినిమా సీన్ రిపీట్.. చనిపోయిన గర్భిణి

Video Call

Video Call

Operation:  సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే బీహర్ లోని పూర్ణియా జిల్లాలో జరిగింది. అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమాలో చూపించిన విధంగా.. నిజ జీవితంలో డార్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ నర్సు ఓ గర్భిణికి ప్రసవం చేసి.. ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. మాల్తీ దేవి(22) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సోమవారం సాయంత్రం పూర్ణియా లైన్ బజార్లోని సమర్పణ్ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ సీమా కుమారి హాస్పిటల్ లో లేరు. ఆమె నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆ మహిళను హాస్పిటల్ మేనేజ్ మెంట్ అడ్మిట్ చేసుకుంది.

Read Also:New York: న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం

ఈ క్రమంలోనే మాలతికి తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. ఓ నర్సుకు ఆపరేషన్ చేయాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆమె డాక్టర్ సీమా కుమారికి వీడియో కాల్ చేసింది. ఆమె సూచనల ఆధారంగా ఆపరేషన్ అయితే పూర్తిచేసింది. మాలతికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కానీ ఆ నర్సు ఆమెకు తెలియకుండానే పేషెంట్ కడుపులోని ముఖ్య నరాన్ని కట్ చేసింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారి మరణించింది. ఆ మహిళ జన్మనిచ్చిన ఇద్దరు శిశువులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఖాజాంచి సహాయక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రంజిత్ కుమార్ తన పోలీసు బృందంతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి శాంతిభద్రతలను పునరుద్ధరించారు.

Read Also:Honda Car: హోండాలో ఈ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్..

బాధితురాలి కుటుంబం నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. దాన్ని పూర్ణియాలోని సివిల్ సర్జన్ ఆఫీసుకు పంపించామని తెలిపారు. ఈ విషయాన్ని పూర్ణియా సివిల్ సర్జన్ దర్యాప్తు చేసి, వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే డాక్టర్, ఆసుపత్రి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎస్ హెచ్ వో వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో జన అధికార్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ ఎంపీ పప్పుయాదవ్ హాస్పిటల్ కు చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్ సర్జన్, ఎస్ హెచ్ వోను కోరారు.