మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : The RajaSaab : బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ పై తమన్ ఫైర్
అసలుసిసలైన పండగ చిత్రంగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ఇక తాజాగా మరో వైవిధ్యమైన వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ పేరుతో ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకను నవీన్ పోలిశెట్టి హోస్ట్ చేస్తూ నవ్వులు పూయించారు. నాయకానాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలోని ‘భీమవరం బాల్మా’, ‘రాజు గారి పెళ్లిరో’ పాటలకు వేదికపై నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. అనంతరం అతిథులందరికీ స్వాగతం పలికి, నిజంగానే పెళ్లి రిసెప్షన్ వేడుకను తలపించారు. ఇక నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరులులా వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రికేయలు బంధుమిత్రుల్లా ఒక్కొక్కరిగా వేదికపైకి వచ్చి.. ఆ జంటను ఆశీర్వదించడం, గిఫ్ట్ కవర్ ఇచ్చి వారిని ఓ ప్రశ్న అడగటం.. ఇలా ఎంతో కొత్తగా, సరదాగా ఈ వేడుక నడిచింది.
