Cancer Injection: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్. క్యాన్సర్ సోకితే పలు దశల్లో చేయించుకునే ‘‘కీమో థెరపీ’’ బాధల నుంచి విముక్తి కలిగించే చికిత్స విధానం వచ్చింది. భారత్లో లంగ్ క్యాన్సర్కు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ రోష్ ఫార్మా ఇండియా ‘‘టెసెంట్రిక్’’ అనే కొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్ను తీసుకువచ్చింది. ఇది కేవలం 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది.
ఇప్పటి వరకు ఇమ్యునోథెరపీ కోసం రోగులు గంటల తరబడి ఐవీ ద్వారా మందులు ఎక్కించుకోవాల్సి వచ్చేది. కానీ ఈ ఇంజెక్షన్ వల్ల చికిత్స సమయం భారీగా తగ్గుతుంది. ఈ కొత్త ఇంజెక్షన్ ముఖ్యంగా నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC) బాధితులకు ఉపయోగపడనుంది. భారతదేశంలో ఎక్కువగా కనిపించే లంగ్ క్యాన్సర్లలో ఇది ఒక రకం. చికిత్స సమయం తగ్గడం, ఆస్పత్రుల్లో ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత.
ఎలా పనిచేస్తుంది.?
ఈ ఇంజెక్షన్లో ‘‘అటెజోలిజుమాబ్’’ అనే ఇమ్యునోథెరపీ ఔషధాన్ని ఉపయోగిస్తారు. సాధారణ కీమోథెరపీలా ఇది క్యాన్సర్ కణాలపై పనిచేయదు. దీనికి బదులుగా శరరీంలోని రోగ నిరోధక వ్యవస్థకు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని అంతం చేసేలా సాయపడుతుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు PD-L1 అనే ప్రోటీన్ ద్వారా ఇమ్యూన్ సిస్టమ్కు దొరక్కుండా దాక్కుంటాయి. టెసెంట్రిక్ ఆ ప్రొటీన్ను అడ్డుకుంటుంది. దీని ద్వారా మందు క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించి అటాక్ చేయగలదు. కీమోథెరపీలో మందులు ఆరోగ్యవంతమైన కణాలతో పాటు క్యాన్సర్ కణాలపై కూడా దాడి చేస్తాయి. కానీ ఈ ఇంజెక్షన్ కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
ధర వింటే షాక్..
ఇదంతా బాగానే ఉన్నా, ఈ మందు సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉంది. దీని ఒక్క డోస్ ధర రూ. 3.7 లక్షల వరకు ఉంటుంది. చాలా మంది రోగులకు 6 డోసులు అవసరం అవుతుంది. దీంతో మొత్తం ఖర్చు లక్షల్లోకి వెళ్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలు భరించలేని ధర.
ఎవరికి ప్రయోజనం..?
వైద్యులు చెబుతున్న దాని ప్రకారం, ఈ మందును అందరు రోగులకు ఇవ్వరు. రోగి ట్యూమర్లో PD-L1 ప్రోటీన్ స్థాయిలను ముందుగా పరీక్షిస్తారు. ఎక్కువ డోస్ స్థాయిలో ఈ ప్రొటీన్ ఉన్న రోగులు ఈ చికిత్సకు బాగా స్పందించే అవకాశముందని చెబుతున్నారు. రోగి ఆరోగ్య స్థితి, క్యాన్సర్ దశ ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు.
