Appanna Temple Incident : సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తులు నిజరూప దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో భారీ వాన కురిసింది. ఆ ధాటికి గోడ కూలి భక్తులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు వదిలారు.
Read Also : Sritej: సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీ తేజ డిశ్చార్జ్
విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారు నిజరూప దర్శనం ఇస్తారు. ఈ సమయంలో దర్శించుకుంటే మంచిదనేది భక్తుల నమ్మకం. అందుకే వందలాది మంది సింహగిరి బస్టాండ్ నుంచి పైనకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ ముందు రూ.300 క్యూలైన్లలో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి మరింత పెరిగింది. తెల్లవారు జామున 3గంటల సమయంలో గోడ కూలినట్టు తెలుస్తోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువైపు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. గోడ వారి తలలపైనే ప్రధానంగా పడిపోయింది. దీంతో భక్తులు గుర్తుపట్టలేనంతగా చితికిపోయారు. ఏడుగురు మృతి చెందగా.. నలుగురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.
విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు ఘటన వద్దకు చేరుకున్నాయి. మృతదేహాలను బయటకు తీయడంతో పాటు.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Read Also : Off The Record: పటాన్చెరు కాంగ్రెస్లో ఆరని మంటలు.. పరిష్కారం కోసం ఇద్దరు సభ్యుల పార్టీ కమిటీ!