బిపర్జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే నేడు (మంగళవారం) 67 ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొనింది. రద్దైన రైళ్లలో ముంబైకి చెందినవి 5 ఉన్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పలు భద్రత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రద్దైన ట్రైన్లకు సంబంధించిన టికెట్ల రిఫండ్ త్వరలో ప్రయాణికుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పశ్చిమ రైల్వే వెల్లడించింది.
Also Read : Avinash Reddy: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
భవ్నగర్ డివిజన్లో 5, రాజ్కోట్లోని 8, అహ్మదాబాద్ డివిజన్లోని 3 ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు డబ్ల్యూఆర్లోని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తెలిపారు. 50 కిలో మీటర్ల కంటే అధికంగా గాలులు వీస్తే వెంటనే రైళ్లను నిలిపివేయాలని స్టేషన్ మాస్టర్లకు రైల్వే అధికారులు సూచించారు. ట్రాక్, వంతెనలపై ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రైలు కార్యకలాపాలకు ఏదైనా ఆటంకం కలిగితే తక్షణ చర్యలు తీసుకోవాలని కంట్రోల్ రూమ్కి సూచించాలని పేర్కొన్నారు. వైర్లెస్ కమ్యూనికేషన్, 15 వీహెచ్ఎఫ్ సెట్లు, శాటిలైట్ ఫోన్లు తదితర సౌకర్యాలతో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.
Also Read : Rakesh Tikait: రైతు ఉద్యమంపై ఫేస్బుక్, ట్విట్టర్లో తగిన ప్రచారం జరగలేదు
రాబోయే తుఫాన్ ముప్పును విజయవంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమ రైల్వే అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నెల 15 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే తీరప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను సైతం రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
