NTV Telugu Site icon

SRSP: 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్సారెస్పీ.. నేటి నుంచి సాగు నీటి విడుదల

Srsp

Srsp

Sriram Sagar Project: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. 1978లో ప్రాజెక్టు పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్‌ సర్కారు హయాంలో ప్రాజెక్టు పైన నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. పూడిక కారణంగా ఇది 90.313 టీఎంసీల నీటి నిల్వకు పడిపోయింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వలను అందుబాటులోకి తెచ్చారు. నిజామాబాద్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచింది ఈ ప్రాజెక్టు. 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఆయనే ప్రారంభించారు.

Read Also: Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు

60 వసంతాల వేడుకల్లో భాగంగా ప్రాజెక్టు వద్ద ఈ రోజు ఉదయం 10 గంటలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి జలహారతి ఇవ్వనున్నారు. శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంటలకు నేటి నుండి సాగు నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఎల్‌ఎండీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి జెన్ కో సిద్ధమైంది.

ఇదిలా ఉండగా.. భారీగా కురిసిన వర్షాల వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 87,222 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 807 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1085 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 66.220టీఎంసీల నీరు నిల్వ ఉంది.