మనుగోడు పోలింగ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి మా ఓటుకు డబ్బులు రాలేదంటూ నాయకులు ఇంటిదగ్గరకు వచ్చి గొడవకు దిగారు. గత నెల మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ జరుగుతున్న నేటి వరకు డబ్బులు, మద్యం పంపిణీ విపరీతంగా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టకేలకు నేటి ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా క్యూలైన్లలో వేచిఉన్నారు. అయితే.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అవస్థలు పడ్డారు. ఎండకు క్యూలైన్లలో నిలుచొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న శ్రీవారి ఆలయం మూసివేత..
అదే సమయంలో కొన్ని చోట్ల బీజేపీ నాయకులు నిరసనలకు దిగారు. ప్రచారం సమయం ముగిసిన టీఆర్ఎస్కు చెందిన నేతలు ఇంకా మునుగోడు నియోజకవర్గంలోనే ఉన్నారని, పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. అయితే.. వారిని పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చదరగొట్టారు. అయితే.. మధ్యాహ్నం 3గంటల వరకు ఉప ఎన్నికకు 59.92 శాతం పోలింగ్ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 1,44,878 ఓట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.