Yusmarg Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. యుస్మార్గ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ లష్కరేతోయిబా కమాండర్ యాసిర్ హతమైనట్లు తెలుస్తోంది. యాసిర్ గతంలో లష్కరేకు చెందిన సులేమాన్ మూసా గ్రూపులో పనిచేసేవాడని సమాచారం. అయితే, సుమారు ఏడాది నుంచి యుస్మార్గ్ ప్రాంతంలో కీలక లష్కర్ కమాండర్గా పనిచేస్తు్న్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు శనివారం యుస్మార్గ్ ప్రాంతంలో అతడి కదలికలు గుర్తించాయి. దీంతో పక్కా ప్లాన్తో ఆపరేషన్ చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో యాసిర్ హతమయ్యాడు.
యాసిర్ గతంలో సులేమాన్ మూసా గ్రూపులో ఉండే వాడు. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి అయిన మూసాను గతేడాది దచిగామ్ ఆపరేషన్లో హతమయ్యాడు. ఇప్పుడు యాసిర్ హతమైన తర్వాత భద్రతా ఏజెన్సీలు అతడి నెట్వర్క్పై దృష్టిసారించాయి. ఇతర లష్కర్ ఉగ్రవాదులతో ఇతడికి ఉన్న సంబంధాలు, ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇతడి పాత్ర, భవిష్యత్ ప్లాన్లలో ఇతడి ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, శుక్రవారం జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్లో సైన్యం, ఇతర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో పాకిస్తానీ జాతీయుడిగా అనుమానిస్తున్న మరో వ్యక్తి హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరో అనుమానిత ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్లో సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు.

