ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఓ విచిత్రమైన కానీ హ్యాపీ ఎండింగ్తో ముగిసిన సంఘటన చోటుచేసుకుంది. అత్త వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంటను మొదట్లో కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో చివరకు రెండు కుటుంబాలు కూడా వారి వివాహానికి సమ్మతి తెలిపాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహబ్బత్పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 24 ఏళ్ల కృష్ణ కుమార్ మరియు చిత్రకూట్ జిల్లా యువతి సంజన చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రేమను వివాహంతో కొనసాగించాలని నిర్ణయించిన ఇద్దరూ ఒక దేవాలయంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, సంజన కృష్ణకుమార్కు అత్త వరుస కావడంతో కుటుంబ పెద్దలు ఈ పెళ్లికి వ్యతిరేకించారు. దీంతో జంట తీవ్ర ఆవేదనకు గురైంది.
ఈ నేపథ్యంలో సంజన ఉధిహిన్ ఖుర్ద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. విషయం సీరియస్గా తీసుకున్న పోలీసులు రెండు కుటుంబాలను స్టేషన్కు పిలిపించి చర్చలు జరిపారు. కొంతసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కొనసాగినా, పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు పెద్దలు ఒప్పుకున్నారు.తర్వాత గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసులు వారి వివాహాన్ని నిర్వహించారు. అనంతరం రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.
