మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఒక యువకుడు తాను పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యానని అబద్ధం చెప్పి, తన ఫోటోలతో బ్యానర్లు, పోస్టర్లు పెట్టించాడు. సమాచారం ప్రకారం, రిషికేష్ జాదవ్ అనే యువకుడు తనను మహారాష్ట్ర పోలీస్ దళంలో ఎంపికయ్యానని పేర్కొంటూ స్థానికంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశాడు. ఆ పోస్టర్లలో అతను పోలీస్ యూనిఫాంలో ఉన్నట్లు, పోలీస్గా ఎంపికైనందుకు అభినందనలు తెలుపుతున్నట్లు చూపించారు.
ఈ పోస్టర్లను గమనించిన బీట్ మార్షల్కు అనుమానం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో రిషికేష్ జాదవ్ అసలు పోలీస్ శాఖలో ఎంపిక కాలేదని, అతను చెప్పిన సమాచారం పూర్తిగా అబద్ధమని తేలింది. పోలీసుల విచారణలో అసలు కారణం బయటపడింది. మంచి పెళ్లి సంబంధం కుదిర్చుకోవడానికి అత్తమామలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నాటకమంతా చేశాడని అధికారులు తెలిపారు.
పోలీస్ శాఖ పేరును దుర్వినియోగం చేయడం, అక్రమంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటి కారణాలతో అతనిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పోలీసులు హెచ్చరించారు.
