Prajwal Revanna: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ కూడా ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మొత్తం కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఓ మహిళ కిడ్నాప్ కేసులో నిన్న జేడీయూ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను రప్పించేందుకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఇంటర్ పోల్ నుంచి ‘బ్లూ కార్నర్ నోటీసు’ కోరే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆర్ అశోక్, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణ అరెస్ట్ బీజేపీ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపించదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గం నుంచి జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గెలిచినా ఆయనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజ్వల్ తప్పించుకోవడానికి సీఎం సాయం చేశాడని అశోక ఆరోపించారు. హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లుగా సిద్ధరామయ్య హసన్లో ప్రజ్వల్కి ఎందుకు మద్దతిచ్చారని అడిగారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకుని 2019 లోక్సభ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేశాయి. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ మిత్రపక్షంగా ఉంది. కర్ణాటకలో మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకుంటే ప్రజ్వల్ రేవణ్ణపై కఠిన చర్యలు తీసుకుంటామని అశోక అన్నారు. ఇటీవల హసన్ జిల్లా వ్యాప్తంగా ప్రజ్వల్కి సంబంధించిన సెక్స్ టేపులు వైరల్ అయ్యాయి. అయితే, ఇవి మార్ఫింగ్ వీడియోలు అని ప్రజ్వల్ తన పోలింగ్ ఏజెంట్ ద్వారా ఫిర్యాదు చేశారు.
