Adhir Ranjan Chowdhury: పశ్చిమ బెంగాల్లో చివరిదైన రెండో విడత ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, రెండో విడతలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో ఒక బూత్ నుండి మరొక బూత్కు పరుగెత్తడం మనం చూడటం ఇదే మొదటిసారి. ఇలా మునుపెన్నడూ చూడలేదు. ఆమె కళ్లలో, ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. నిజానికి, ఈసారి గెలుస్తాననే నమ్మకం ఆమెకు అస్సలు లేదు.” అని అన్నారు. భవానీపూర్ వంటి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించడానికి రావడం చూస్తే ఆమె రాజకీయ పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు.
Read Also: Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ఈసారి బెంగాల్ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఈ సీటు నుంచే బీజేపీ కీలక నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు ఓడించారు. ఈసారి భవానీపూర్ నుంచి కూడా ఓడించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ లోని ప్రతీ ప్రాంతంలో పోలింగ్ రోజున మమతా పర్యటించారు.
బెంగాల్ బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, ఎన్నికల సంఘం ఏర్పాట్లను ప్రశంసించారు. తొలిసారిగా బెంగాల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓట్లు వేస్తున్నారని అన్నారు. బెంగాల్లో హింసా సంస్కృతి టీఎంసీ వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు. ఇక్కడ భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించడంతో ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారని అన్నారు.
