Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఈవీఎంలు ఓపెన్ కానున్నాయి. ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల ముందు సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా ‘‘లోడ్ షెడ్డింగ్’’ జరుగుతోందని ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
Read Also: Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
ఎక్స్ పోస్టులో.. హుగ్లీలోని సెరంపూర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్లోని ఆస్గ్రామ్, కోల్కతాలోని క్షుదిరామ్ అనుశీలన్ కేంద్రం వంటి ప్రాంతాల నుండి తనకు నివేదికలు అందాయని, ఈ ప్రాంతాల్లో దశలవారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ఈ ప్రాంతాలల్లో సీసీటీవీ కెమరాలను స్విచ్ ఆఫ్ చేశారని ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద వాహనాల రాకపోకలు కనిపించాయని ఆమె ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాపలా కాయాలని తన కార్యకర్తల్ని ఆదేశించారు. అనుమానాస్పద పరిస్థితులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాగే సీసీటీవీ ఫుటేజ్ను అందించాలని మమతా డిమాండ్ చేశారు.
ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం మినహా బెంగాల్లోని 293 స్థానాలకు ఈ రోజు ఓట్ల లెక్కింపు ఉంది. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదైంది. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రెండు పార్టీలకు మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ప్రిడిక్ట్ చేశాయి.
