NTV Telugu Site icon

Kerala: విష్ణుజా మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Kerala

Kerala

కేరళలో సంచలనం సృష్టించిన విష్ణుజా(25) మృతి కేసులో విస్మయం కలిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు పెట్టిన హింస భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. దీంతో భర్త ప్రభిన్‌ అరెస్ట్‌ చేశారు.

మలప్పురం ప్రాంతానికి చెందిన విష్ణుజాకి 2023 మే నెలలో ప్రభిన్‌ అనే యువకుడితో వివాహమైంది. అనంతరం ఎలంగూర్‌లో కాపురం పెట్టారు. ప్రభిన్‌ ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. అయితే 2025, జనవరి 31వ తేదీన భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ప్రభిన్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ప్రభిన్‌ ఇంటికి రాకపోవడంతో.. విష్ణుజా కూడా కిందకు దిగకపోవడంతో కింద పోర్షన్‌లో‌ ఉండే ఆమె అత్త పైకి వెళ్లి చూసింది. ఎంతకీ స్పందన లేకపోవడంతో.. స్థానిక సాయంతో తలుపు పగలకొట్టింది. చూసేసరికి.. విష్ణుజా ఫ్యాన్‌ను ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.

భర్త, అత్తమామలే చంపేసి.. ఆత్మహత్యకు చిత్రీకరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అందం లేదని.. బైక్‌పై కూడా తీసుకెళ్లేవాడు కాదని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతం అయ్యారు. స్నేహితుల స్టేట్‌మెంట్‌ ప్రకారం.. గత కొంతకాలంగా విష్ణుజాను భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వచ్చాడని… ఈ విషయం అతని తల్లికి కూడా తెలుసు అన్నారు. పెళ్లైన తొలినాళ్ల నుంచే విష్ణుజాను భర్త హింసిస్తూ వచ్చాడని.. అందంగా లేదని.. తనకు నచ్చినట్లు తయారు కావట్లేదని సూటిపోటి మాటలతో వేధించేవాడని స్నేహితులు చెప్పారు. పైగా తరచూ ఆమెను కొట్టేవాడని.. ఇంత చదువు చదివి ఉద్యోగమూ లేదని తిట్టేవాడని చెప్పుకొచ్చారు.