Site icon NTV Telugu

Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..

Uttarakhand

Uttarakhand

Uttarakhand: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులోని 11 మంది నదిలో పడిపోయారు. వీరిలో ఆరుగురు గల్లంతవ్వగా.. 5 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి.. రోడ్లపై పడ్డాయి. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డుగా పడి ఉన్న బండరాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలో పడింది.

Read also: Passion Fruit : పాషన్ ఫ్రూట్ అనే ఈ జ్యూస్ గురించి తెలుసా..?

స్థానికుల సమాచారంతో పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిపోయిన 11 మందిలో ఐదుగుర్ని రెస్క్యూ టీమ్ రక్షించింది. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో నుంచి భార్యను రక్షించిన రెస్క్యూ టీమ్, భర్త కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బాధితులు సోన్‌ ప్రయాగ్ నుంచి శనివారం రాత్రి 8 గంటలకు రిషికేశ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 3 గంటల సమయంలో తెహ్రీ జిల్లా గులార్ సమీపంలోని మలకుంతి బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండ రాయిను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. దీని గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో నుంచి ఐదుగురిని రక్షించ గలిగారు. వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గల్లంతైన డ్రైవర్‌తో సహా మరో ఆరుగురి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైనవారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ (Search and Rescue Operation) కొనసాగుతోంది. వర్షాల కారణంగా పర్వతాల మీద నుంచి బండరాయి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చింది. ఆ బండరాయిని తప్పించే ప్రయత్నంలో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి.. రోడ్డు మీద నుంచి లోయలో ప్రవహించే నదిలో పడిపోయింది.

Exit mobile version