PM Modi: అమెరికా పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది..

Modi

Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు. ఇది అమెరికా-ఇండియా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటన, ప్రాధాన్యత గురించి వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.‘‘ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్. జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు నేను యూఎస్ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం యొక్క శక్తి, చైతన్యానికి ప్రతిబింబం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..

భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత పెరిగేందుకు, వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడానికి తన అమెరికా పర్యటన ఒక అవకాశం అని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో రెండు దేశాలు కలిసి బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తన పర్యటన న్యూయార్క్ నుండి ప్రారంభమవుతుందని, అక్కడ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటానని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించాలన్న భారతదేశ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన ప్రదేశంలో వేడుకలు జరుగుతాయని మోడీ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ బైడెన్ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటున్నట్లు ప్రకటనలో చెప్పారు.

భారత్-అమెరికా సంబంధాలు బహుముఖంగా ఉన్నాయని.. వస్తువులు, సేవల్లో అమెరికా భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, సైన్ అండ్ టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం, రక్షణ, భద్రత రంగాల్లో సన్నిహితంగా సహకరించుకుంటాని మోడీ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని పలు కంపెనీల సీఈఓలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. దీంతో పాటు ఇండియా-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడనున్నారు. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో ప్రధాని పర్యటన జరగనుంది. ఆ తరువాత జూన్ 23,24 తేదీల్లో ఈజిప్టులో పర్యటించనున్నారు. ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా ఆయన ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.