Pannun case: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసులో భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా(52)ను తమకు అప్పగించాలని అమెరికా కోరుతున్నట్లు చెక్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు. నిఖిల్ గుప్తా కస్టడీని చెక్ అధికారులు ధ్రువీకరించారు. పన్నూ హత్య కుట్రలో ఇతని పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తోంది. భారత ప్రభుత్వ ఉద్యోగి ఆధ్వర్యంలో నిఖిల్ గుప్తా అమెరికా గడ్డపై, అమెరికన్ పౌరుడు పన్నూను చంపేందుకు కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గుప్తాను ఈ ఏడాది జూన్ నెలలో చెక్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also: AP Lokayukta: 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం
చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రతినిధి వ్లాదిమిర్ రెప్కా ప్రకారం, గుప్తాను అమెరికా అభ్యర్థన మేరకు అరెస్ట్ చేశామని, ఆ తర్వాత అతడిని అప్పగించాలని అభ్యర్థన వచ్చిందని, కిరాయి హత్యకు కుట్ర పన్నినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయని చెప్పారు. అతడిని యూఎస్కి అప్పగించేందుకు చెక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
భారత్ చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయంలో యూఎస్, తన ఆందోళనల్ని భారత్ వద్ద వ్యక్తం చేసింది. మరోవైపు ఎఫ్బీఐ, సీఐఏ చీఫ్లు భారత్కి వచ్చారు. ఈ కేసులో పన్నూను హత్య చేసేందుకు ఓ హంతకుడికి నిఖిల్ గుప్తా 1,00,000 డాలర్లు చెల్లించాడని, ఇందుకు జూన్ 9, 2023న 15,000 డాలర్లు అడ్వాన్సుగా ఇచ్చారని యూఎస్ న్యాయ శాఖ పత్రాలు పేర్కొన్నాయి.
