దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. అమర్ కాలనీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె (22)పై అత్యాచారం చేసి చంపేశారు. బుధవారం ఉదయం తల్లిదండ్రులు జిమ్కు వెళ్లిన సమయంలో ఈ ఘాతుకం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
ఢిల్లీలోని ఆగ్నేయ ప్రాంతంలో అమర్ కాలనీలో ఐఆర్ఎస్ అధికారి కుటుంబం ఉంటుంది. కుమార్తె యూపీఎస్సీకి సిద్ధపడుతోంది. అయితే తల్లిదండ్రులు ఉదయం జిమ్కు వెళ్లారు. కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా యువతిపై అత్యాచారం చేసి మొబైల్ ఛార్జింగ్ కేబుల్తో గొంతు నులిమి చంపేశారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమార్తెను చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో పని చేసిన మాజీ పనిమినిషిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెలన్నర క్రితం పనిమనిషిని ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పటి నుంచి అధికారిపై అతడు పగతో రగిలిపోతున్నాడు. కక్ష సాధించుకోవాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించి.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మృతురాలు ఇంజనీరింగ్ చదివి.. ప్రస్తుతం యూపీఎస్సీకి సిద్ధమవుతోందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఉదయం జిమ్లో ఉన్నారని చెప్పారు. అనుమానితుడైన పనిమనిషి రాజస్థాన్కు చెందినవాడని.. అతడిని కొన్ని నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. నిందితుడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
