UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన

  • యూపీఐ ఎండీఆర్ ఛార్జీలపై వ్యాపారుల్లో ఆందోళన..
  • డిజిటల్ నుంచి క్యాష్ ఎకానమీ వైపు వెళ్లే అవకాశం..?
  • ముఖ్యంగా చిన్న వ్యాపారుల్లో భయం..
Upi

Upi

UPI Charges: రూ.2,000కు పైబడిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి ‘‘మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR)’’ అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే, దీనిపై ఇప్పుడు చాలా మందిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రిటైర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఛార్జీ వల్ల చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల నుంచి నగదు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్తగా అమలు కాబోయే UPI ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిని కస్టమర్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. పర్సన్ టూ మర్చంట్ (P2M) UPI లావాదేవీల్లో రూ.2,000 మించితే 0.4 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. అయితే, దీనిని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీ సదరు వ్యాపారి నుంచి పేమెంట్ సిస్టమ్‌కు చేరుతుంది. కొత్త విధానంలో డిజిటల్ చెల్లింపులు రూ. 2000 మించితే రూ. 12, రూ. 50000 వేల చెల్లింపులపై రూ. 200, రూ. 75000 లేదా అంతకన్నా ఎక్కువ మర్చంట్ లావాదేవీలపై గరిష్టంగా రూ. 300  ఎండీఆర్‌ను పరిమితం చేశారు.

కొత్త విధానం వల్ల కస్టమర్లు ఎక్కడా యూపీఐ చెల్లింపులపై ఛార్జీ చెల్లించరు. పర్సన్ టూ పర్సన్ (P2P) పూర్తిగా ఉచితంగానే జరుగుతాయి. రూ. 2000 వరకు వ్యాపారికి చెల్లించే చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ లేదు. నెలకు యూపీఐ QR ద్వారా రూ. 1 లక్ష వరకు స్వీకరించే వ్యాపారులకు కూడా ఎలాంటి ఎండీఆర్ లేదు. దేశంలో పర్సన్ టూ మర్చంట్(P2M) లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎండీఆర్ ను ప్రభుత్వం లేదా NPCI వసూలు చేసే పన్ను కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఇది బ్యాంకులు, పేమెంట్ యాప్‌ల వంటి యూపీఐ పేమెంట్ ఎకోసిస్టమ్‌లోని భాగస్వాములకు పంపిణీ అయ్యే ఛార్జీ అని తెలిపింది.

కస్టమర్లకు ఉచితమే, చిన్న వ్యాపారుల్లో ఆందోళన..

ఇదే సమయంలో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తే వారు డిజిటల్ పేమెంట్స్ నుంచి నగదు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో దసరా, దీపావళి పండగ సమయంలో ఛార్జీ అమలును ప్రశ్నించారు. పండగల సమయంలో రిటైల్ అమ్మకాలు కీలకంగా ఉండే సమయంలో డిజిటల్ చెల్లింపులపై వ్యాపారులు అదనపు భారాన్ని మోపొచ్చని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులు ఎండీఆర్‌ను కస్టమర్లపై మోపే అవకాశం కూడా ఉంటుందని, ఒక వేళ కస్టమన్ ఈ ఛార్జీని చెల్లించనంటే, నగదు ఇవ్వాలని కోరే అవకాశాలు కూడా ఉన్నాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.