Kanwar Yatra: కన్వార్ యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా దుకాణాలపై ప్రదర్శించాలన్న ఆదేశాలను తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొనింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తాజాగా తమ వివరణను తెలిపింది. షాప్స్, తినుబండారాల పేర్ల విషయంలో సందేహాలు ఉన్నట్లు యాత్రికులు ఫిర్యాదు చేశారని యోగి సర్కార్ తెలిపింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశామని.. అందుకు తగినట్లు పోలీసులు చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Read Also: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..
కాగా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్ యజమానులు ఎవరు.. అందులో పని చేసే వారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన పని లేదని చెప్పుకొచ్చింది. గంగానది జలాలను కావడిపై తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, పౌరహక్కుల పరిరక్షణ సంఘం నేతలు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం ఎంక్వైరీ చేసింది.