మూడు సైనిక హెలికాప్టర్లు.. డజన్ల కొద్దీ సైనికులు. ఒక్కసారిగా గ్రామంపై మోహరించారు. ఏం జరుగుతుందో తెలియక చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు హడలెత్తిపోయారు. చాలా మంది నిశ్చేష్టులైపోయారు. ఇందుకు ఉత్తరప్రదేశ్లోని నారాయణి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు వేదికయ్యాయి. అసలేం జరిగింది? ఒకేసారి గ్రామంపైకి మూడు హెలికాప్టర్లు, సైన్యం ఎందుకు మోహరించాయి. తెలియాలంటే ఈ వార్త చదవండి.
మంగళవారం బండా పొలాల్లోకి హఠాత్తుగా మూడు సైనిక హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ సైనికులు దిగి గ్రామాన్ని చుట్టుముట్టారు. చాలా తక్కువ ఎత్తుల హెలికాప్టర్లు ఎగరడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు భయంతో బయటకు వచ్చారు. ఇంకొందరు మిద్దెలపైకి ఎక్కి భయం.. భయంతో వీక్షించారు. బండాలోని నరాయిని ప్రాంతాన్ని సైనికులు తీవ్రంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో గ్రామస్తుల భయాందోళనకు గురయ్యారు. సెర్చ్ ఆపరేషన్ పూర్తయ్యాక.. మాక్ డ్రిల్ అని సైనికులు చెప్పడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మొబైల్స్లో బంధించారు.
అయితే ఎప్పుడూ ఇలాంటి ఘటన ఎదురుకాకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మాక్ డ్రిల్ అని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది ఈ సంఘటనను తమ మొబైల్లో బంధించారు. సుమారు కొన్ని గంటల పాటు ఈ విన్యాసం సాగింది.
భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. నారాయణి కొత్వాలి ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మొత్తం ఆపరేషన్ను సైన్యం ఒక మాక్ డ్రిల్లో భాగంగా నిర్వహించిందని వివరించారు. భద్రతా వ్యవస్థను, అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని.. ఇది ఒక సాధారణ విన్యాసంలో భాగమని పేర్కొన్నారు.
