వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్షం నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ఇటీవల వీధుల్లో నమాజ్ చేస్తే పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తామని యూపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని విలేకర్లు ప్రశ్నించగా.. ఇది ‘‘పనికిరాని చర్చ’’ అంటూ తోసిపుచ్చారు. దీనిపై చర్చ అనవసరం అని.. అర్థరహితమైన చర్చ అంటూ తిప్పికొట్టారు. దేశంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. అనేక ప్రధాన సమస్యలుండగా దీనిపై చర్చ అవసరమంటారా? అని పేర్కొన్నారు. అయినా చాలా సంవత్సరాలుగా వీధుల్లో నమాజ్ చేస్తున్నారని.. ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు.
ఒక విషయం ఏంటంటే అసంబద్ధ అంశాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తే.. సమాజంలో.. దేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎటువంటి కారణాలు లేకుండానే సంఘాలు, ప్రజల మధ్య చీలికలు ఏర్పడతాయని.. కనుక ఇలాంటి చర్చలు అర్థరహితం అంటూ కేంద్రమంత్రి మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్రమంత్రిగా ఎలా పని చేస్తున్నానో అడగవచ్చు.. ఇందులో ఏమీ తప్పులేదన్నారు. మిగతా విషయాలు గురించి మాట్లాడితే అపార్థాలు ఏర్పడతాయన్నారు.
బీజేపీలోని వ్యక్తులు.. వీధుల్లో నమాజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా.. దాన్ని తాను అంగీకరించనన్నారు. 21వ శతాబ్ధానికి చెందిన విద్యావంతుడ్ని.. మతపరమైన విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. తాను బీజేపీ మిత్రపక్షమైనా కూడా మత సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తెలిపారు. తాను కూడా ఇఫ్తార్ విందుకు తిలకం పెట్టుకునే హాజరయ్యాను. అది ‘‘నా విశ్వాసం’’.. ఇతరుల మతాన్ని గౌరవిస్తూనే.. ‘‘నా మత విశ్వాసాన్ని’’ మరిచిపోనన్నారు. ఎవరి వ్యక్తిగత విశ్వాసం వారిది అని చెప్పారు. చాలా మంది హిందువుల్లోనే తిలకం పెట్టుకోరు.. అంతమాత్రాన వారంతా హిందువులు కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. ఎవరి విశ్వాసం వారిది.. ఎవరి వ్యక్తిగత విషయాలు వారి సొంత అని అభిప్రాయపడ్డారు. తాను చెప్పేదొకటే.. హిందూ-ముస్లింల గురించి మాట్లాడటం కంటే.. దేశంలో పరిష్కరించాల్సిన చాలా విషయాలు చాలా ఉన్నాయని.. వాటి గురించి మాట్లాడుకుంటే మంచిది అని కేంద్రమంత్రి హితవు పలికారు.