ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బళ్లారి-గుంతకల్ రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి రూ.1,264 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వే సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పరిధిలో రూపొందించారు. బహుళ రవాణా అనుసంధానం (మల్టీ-మోడల్ కనెక్టివిటీ), లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక ప్రకారం దీనిని అమలు చేయనున్నారు. ప్రజలు, వస్తువులు, సేవల రవాణా మరింత వేగవంతంగా సాగేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
46 కిలోమీటర్ల మేర రైల్వే విస్తరణ
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టుతో భారతీయ రైల్వే నెట్వర్క్కు సుమారు 46 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు జతకానున్నాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 99 గ్రామాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభించనుంది. ఈ గ్రామాల్లో దాదాపు 7 లక్షల మంది జనాభా నివసిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ రైల్వే మార్గ విస్తరణతో బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడనుంది. దీంతో పర్యాటక రంగానికీ ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గం ద్వారా ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, ఇనుము-ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటి కీలక వస్తువులు పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయి. కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే ఏటా అదనంగా 16.22 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని అంచనా.
పర్యావరణానికి మేలు
ఈ ప్రాజెక్టు అమలుతో రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గి, రైల్వే ద్వారా సరుకు రవాణా పెరుగుతుంది. ఫలితంగా 1.32 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు, 6.67 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది సుమారు 27 లక్షల చెట్లను నాటినంత పర్యావరణ ప్రయోజనం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భారతీయ రైల్వేలో లైన్ సామర్థ్యం పెరిగి, రైళ్ల రాకపోకలు మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణా సేవలు మరింత విశ్వసనీయంగా మారనున్నాయి.

