Udhayanidhi Stalin New Controversy: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో సనాతన ధర్మంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు ఆలయ దర్శనం చేసుకోవడం వివాదానికి దారితీసింది. ప్రచారంలో భాగంగా ఆలయానికి వెళ్లిన సమయంలో ఆయన బొట్టు పెట్టుకుని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ బొట్టును తుడిచివేశారనే ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
“సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది… దాన్ని నిర్మూలించాలి” అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు ఉదయనిధిపై మండిపడుతున్నాయి హిందూ సంఘలు.. అదే నేత ఇప్పుడు ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపిస్తున్నారు. డీఎంకే నేతలు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, హిందూ భావోద్వేగాలతో ఆటలాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో.. విపక్షాలకు ముఖ్యంగా బీజేపీ కూటమికి ఇది మరో ఆయుధం కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
