తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో ప్రధాన నిందితుడు, భర్త సమర్థ్సింగ్ 10 రోజుల తర్వాత న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. సమర్థ్ సింగ్ ఎట్టకేలకు జబల్పూర్ జిల్లా కోర్టులో సరెండర్ అయ్యాడు. ఈ విషయాన్ని అతని న్యాయవాది మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేశారు. సమర్థ్ వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు.. సమర్థ్ సింగ్ భోపాల్లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్ లేదా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవచ్చని అనుమతిస్తూ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్లోని అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పెళ్లైన 4 నెలలకే ఈ ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ట్విషా కుటుంబ సభ్యులు.. భర్త సమర్థ్ సింగ్, అత్తమామలు వరకట్న వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు. అయితే సమర్థ్ కుటుంబం మాత్రం ట్విషా శర్మకు డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే పోస్ట్మార్టం నివేదికలో ట్విషా శర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ.. బాధిత కుటుంబం ఆ నివేదికను అంగీకరించడం లేదు. హత్య జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్విషా తండ్రి తరపు న్యాయవాది రెండో పోస్ట్మార్టం చేయాలని కోర్టును కోరారు. “సమయం వేగంగా గడుస్తోంది” అంటూ అత్యవసర విచారణ కోరడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో పోస్టుమార్టానికి అంగీకరించింది.
అయితే ట్విషా అత్తగారు గిరిబాలా సింగ్ తరపు న్యాయవాది దీనికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే భోపాల్ ఎయిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారని.. మళ్లీ మరో పోస్టుమార్టం కోరడం వైద్య వర్గాన్ని అవమానించడమేనని వాదించారు. “ఇది వైద్యుల సామర్థ్యాన్ని ప్రశ్నించడమే” అని కోర్టులో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుల నిష్పక్షపాతిత్వంపై ఎలాంటి సందేహం లేదని.. కానీ బాధిత కుటుంబానికి ఇంకా అనుమానాలు ఉంటే రెండో అభిప్రాయం తీసుకోవచ్చని కోర్టుకు తెలిపారు.
ఇదే సమయంలో ట్విషా శర్మ అంత్యక్రియలను మరింత ఆలస్యం చేయరాదని సమర్థ్ తరపు న్యాయవాది వాదించారు. “ఆమె మా కుటుంబ కోడలు. ఆమెకు చివరి సంస్కారాలు నిర్వహించడం మా బాధ్యత” అని తెలిపారు. ప్రస్తుతం ట్విషా శర్మ మృతదేహం భోపాల్ ఎయిమ్స్ మార్చురీలో మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర భద్రపరిచినట్లు కోర్టు పేర్కొంది. అయితే దీర్ఘకాలంగా భద్రపరచాలంటే మైనస్ 80 డిగ్రీల సదుపాయం అవసరమని.. అలాంటి సదుపాయం నగరంలో ఎక్కడా లేదని వెల్లడించింది.
ఇక ఈ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు సిఫార్సు చేసింది. కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయడానికి అధికారిక అనుమతి కూడా ఇచ్చింది. “ప్రధాన నేరం, దానికి సహకరించిన వారు, కుట్ర కోణం సహా అన్ని అంశాలపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది” అని మోహన్ యాదవ్ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో పేర్కొంది. హోం శాఖ కార్యదర్శి కృష్ణవేణి దేశావతు సంతకం చేసిన ఈ ఉత్తర్వులను కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.
#WATCH | Jabalpur, Madhya Pradesh | Twisha Sharma death case | Twisha's husband and the accused, Samarth Singh's advocate Jaideep Kaurav says, "He (Samarth Singh) has to surrender, he hasn't surrendered yet, he's not arrived at the court premises…He will surrender in Jabalpur… pic.twitter.com/xF9VeI9OkV
— ANI (@ANI) May 22, 2026

