NTV Telugu Site icon

TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”

Tmc

Tmc

TMC Leader: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై ఆర్ జీ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో ఈ ఘటన జరిగింది. నిందితుడైన సంజయ్ రాయ్‌పై చర్యలు తీసుకోవాలని వైద్యులతో సహా సాధారణ ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. వెస్ట్ బెంగాల్‌లో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన రాష్ట్రంలోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్కారుపై వ్యతిరేకతను పెంచింది.

Read Also: Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ

నిరసనలు మిన్నంటడంతో తృణమూల్ నాయకులు నిరసనకారుల్ని బెదిరిస్తూ వీధి గుండాల్లా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ తగలబడితే ఢిల్లీ, యూపీ, ఒడిశా, బీహార్, అస్సాం తగలబడుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా టీఎంసీకి చెందిన నాయకుడు అతిష్ సర్కార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే వారిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము మీ ఇళ్లలోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీసి, వీధుల్లో గోడలపై అంటిస్తాము’’ అని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు సదరు టీఎంసీ మాజీ కౌన్సిలర్ అయిన అతిష్ సర్కార్‌పై ఒక ఏడాది పాటు పార్టీ సస్పెన్షన్ విధించింది. అయితే, అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నార్త్ 24 పరగణాస్‌‌లోని అశోక్ నగర్‌కి చెందిన టీఎంసీ నేత అయిన సర్కార్ బెదిరిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము మీ వీధుల్లో తిరిగితే ఒక్కరైన బయటకు రాగలరా..?’’ అని బెదిరించాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఫైర్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతుంటే, టీఎంసీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది.