Bengal Elections: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంది. కౌంటిక్ ముందు మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని సవాల్ చేసింది.
అ పిటిషన్ను అత్యవసరం విచారించాలని టీఎంసీ సుప్రీంకోర్టును కోరింది. అయితే ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును శనివారం విచారణకు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమచారం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంతకుముందు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పోలీసులు టీఎంసీ కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఇటీవల, పశ్చిమ బెంగాల్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటనలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఉండే కౌంటింగ్ సూపర్వైజర్ లేదా కౌంటింగ్ అసిస్టెంట్లలో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ) ఉద్యోగి అయి ఉండాలని చెప్పారు. అయితే, ఇలాంటి ఉత్తర్వులను ఎన్నికల సంఘం మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓ కాదని వాదిస్తూ టీఎంసీ ఈ ఆదేశాన్ని సవాలు చేసింది.
Read Also: Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
ఎన్నికల హ్యాండ్ బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బంది కేంద్ర ఉద్యోగులే ఉండాలని ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. మైక్రో అబ్జర్వులు మాత్రం సాధారణంగా కేంద్ర సర్వీస్ నుంచి వస్తారని, కానీ కౌంటింగ్ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తింపచేయడం అన్యాయమని టీఎంసీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రభావానికి లోనయ్యే అవకావం ఉందని, ఇది సమాన పోటీకి విఘాతం కలిగిస్తుందని టీఎంసీ ఆరోపించింది.
అయితే, టీఎంసీ ఈ వాదనను అంతకుముందు కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ఉద్యోగుల్ని నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి భద్రతా చర్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
