Sanjay Raut: ప్రజాస్వామ్యానికి చౌకీదార్ ఇందిరా గాంధీ.. ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థించిన సంజయ్ రౌత్..

  • ప్రజాస్వామ్యానికి నిజమైన చౌకీదార్ ఇందిరా గాంధీ..
  • రాజ్యాంగానికి లోబడే ‘‘ఎమర్జెన్సీ’’ విధింపు..
  • ఎమర్జెన్సీని సమర్థించిన శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్..
Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: 1975,జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ‘‘అత్యవసర పరిస్థితి’’ని విధించారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయింది. అయితే, బీజేపీ ఎమర్జెన్సీని విమర్శిస్తూ భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ మాత్రం ఇందిరాగాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’ని సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూనే అత్యవసర పరిస్థితి విధించారని ఆయన అన్నారు. బీజేపీ పాలనను విమర్శిస్తూ.. 2014 నుంచి 11 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకుందని చెప్పారు. ఎమర్జెన్సీ విధింపును విమర్శిస్తూ బీజేపీ ఈ రోజు రాజ్యాంగ హత్య దివస్‌గా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

దేశ భద్రతకు ఏదైనా బాహ్య లేదా అంతర్గత శక్తి ద్రోహం చేసినప్పుడు, ఎవరైనా అరాచకాన్ని వ్యాప్తి చేయాలనుకున్నప్పుడు ప్రధాని ఆమోదంతో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించవచ్చని సంజయ్ రౌత్ అన్నారు. ఇది రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కు అని చెప్పారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవిస్తూ ఎమర్జెన్సీ విధించారని చెప్పారు. దీనిని రాజ్యాంగ హత్య దివాస్‌గా పరిగణించలేము అని చెప్పారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ రిగ్గింగ్ ద్వారా ఎన్నికల్లో గెలవగలిగే వారు,కానీ అలా చేయలేదని, ఇప్పడు అదే జరుగుతోందని బీజేపీని విమర్శించారు.

ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యానికి చౌకీదార్ అని, ఆమె ఎన్నికల్లో మోసంతో గెలవలేదని రౌత్ ప్రశంసించారు. 2014 నుండి 11 సంవత్సరాలుగా ఈ దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందని అన్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో అవినీతిపరులంతా జైళ్లలో ఉన్నారని, బాలా సాహెబ్ ఠాక్రే అత్యవసర పరిస్థితిని సమర్థించారని అన్నారు. దేశంలో అరాచకం ప్రబలినప్పుడు ఎమర్జెన్సీ విధించే హక్కు ఉందని చెప్పారు.