NTV Telugu Site icon

Bangladesh Violence: హిందువులే టార్గెట్.. బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల అరాచకం.. వీడియోలు వైరల్..

Temples Burnt, Houses Attacked

Temples Burnt, Houses Attacked

Bangladesh Violence: బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా తయారైంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి వచ్చేసింది. అక్కడి ప్రభుత్వాన్ని ఆర్మీ చేజిక్కించుకుంది. అయినప్పటికీ ఆ దేశంలో హింస చల్లారడం లేదు. ముఖ్యంగా హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ, ముస్లింమూకలు దాడులకు పాల్పడుతున్నాయి. హిందువులను చంపేయడంతో పాటు యువతులను, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ హింసలో ఇద్దరు హిందూ కౌన్సిలర్లు మరణించారు. పలు ప్రాంతాల్లో హిందువుల ఆస్తుల్ని దోపిడి చేయడంతో పాటు యువతులను అపహరిస్తున్నట్లు తెలుస్తోంది.

దేవాలయాలకు నిప్పు పెట్టడంతో పాటు, హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే సమయంలో కొందరు ముస్లిం మతపెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లోని డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. సోమవారం కనీసం 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై మూకదాడులు జరిగాయి. విలువైన వస్తువుల్ని దోచేశారు.ఇస్కాన్ ఆలయానికి నిప్పుపెట్టడంతో పాటు హిందూ కౌన్సిలర్లను హత్య చేశారు. ప్రముఖ క్రికెటర్, బంగ్లాదేశ్ టీంలో హిందువైన లిట్టన్ దాస్ ఇంటికి నిప్పు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Read Also: UK Violence: యూకేలో హింస.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

బంగ్లాదేశ్ ఖుల్నా డివిజన్‌లో మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయం మరియు కాళీ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. వీటి ప్రాంగణంలో ఉన్న ముగ్గురు భక్తులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తీర్ గోవిందదాస్ ట్వీట్ చేశారు. రంగ్‌పూర్ సిటీ కార్పొరేషన్‌కి చెందిన హిందూ కౌన్సిలర్ హరధన్ రాయ్ కూడా ఆదివారం మరణించినట్లు సమాచారం. కాజల్ రాయ్ అనే మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్లు సమాచారం.పిరోజ్‌పూర్ జిల్లాలో ఆపదలో ఉన్న బాలిక సహాయం కోసం వేడుకుంటున్నట్లు ఉన్న వీడియో వైరల్ అయింది. మరోక వీడియోలో ఓ హిందూ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటిపై దాడికి తెగబడుతున్న వ్యక్తుల్ని అడ్డుకుని ప్రాధేయపడుతున్న వీడియో వైరల్ అయింది.

బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై హింస ఎక్కువ కావడంపై అక్కడి మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ దేశ పౌరులం కావడం తప్పా..? అని ప్రశ్నిస్తున్నారు. తాము ఎక్కడికి వెళ్తామని అడుగుతున్నారు. మరోవైపు ఈ హింస వల్ల కోటి మంది హిందూ శరణార్థులు బెంగాల్‌కి వచ్చే అవకాశం ఉందని బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు. అక్కడ జమాతే ఇస్లామ్, భారత వ్యతిరేక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) అధికారం కోసం చేతులు కలపబడంతో రానున్న రోజుల్లో అక్కడి మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది.