బీహార్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వస్తాయని.. 18న ప్రభుత్వం ఏర్పడుతుందని.. అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ప్రధాని మోడీ గమనించాలన్నారు. నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదన్నారు. మహాఘట్బంధన్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పారు. కులమతాలతో సంబంధాలు లేకుండా ఈనెల 26 నుంచి నేరస్థులందరినీ జైలుకు పంపిస్తామని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: తైవాన్ జోలికి పోవద్దు.. చైనాకు వార్నింగ్.. కొద్దిరోజులకే మారిన ట్రంప్ స్వరం
బీహార్లో తొలి విడత పోలింగ్కు సమయం దగ్గర పడింది. గురువారమే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
బీహార్లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 6 (గురువారం), రెండో విడత పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. మహాఘట్బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ పేరును ప్రతిపక్ష కూటమి ప్రకటించగా… ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి పేరు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల మోడీ మాట్లాడుతూ.. నితీష్ నాయకత్వంలో మరోసారి విజయం సాధిస్తామని చెప్పారు.
