Nida Khan: నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మతమార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళా ఉద్యోగి నిదా ఖాన్, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. తాజాగా ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తాను గర్భవతిని అంటూ మధ్యంతర బెయిల్ కోరింది. అయితే, కోర్టు దీనిని తిరస్కరించింది.
నిదా ఖాన్ ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఛత్రపతి శంభాజీనగర్లోని నరేగావ్ ప్రాంతంలోని కైజర్ కాలనీలో నిదా ఖాన్ ఉందనే సమాచారంలో పోలీసులు మూడు నాలుగు రోజులుగా నిఘా నిర్వహించి ఆమెను అరెస్ట్ చేశారు. సాధారణ మనుషుల్లా ప్రవర్తిస్తూ, పోలీస్ యూనిఫాం, జీపులు వాడకుండా పక్కాగా నిఘా పెట్టారు. నిదా ఖాన్ తన తండ్రి, తల్లి, సోదరుడు, మేనత్తతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేశారు. దీని కోసం పోలసీులు సాంకేతిక విశ్లేషన, లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులను ఉపయోగించారు.
Read Also: Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?
నిదా ఖాన్ ఉంటున్న ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం 20 మందికి పైగా పోలీస్ సిబ్బంది మోహరించారు. స్థానిక పోలీసులకు తెలియకుండా ఆపరేషన్ నిర్వహించారు. తన బెయిల్ కోసం మరికొంత మంది న్యాయవాదుల వద్ద న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ముందే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి సుత్గిర్ని చౌక్లోని జడ్జి ముందు నిదాఖాన్ను ప్రవేశపెట్టిన పోలీసులు, ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. ఆ తర్వాత నాసిక్ తీసుకెళ్లారు.
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను మతం మార్చుకోవాలని ఖాన్ బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021 నుండి టీసీఎస్లో ‘ప్రాసెస్ అసోసియేట్’గా పనిచేస్తున్న ఆమె, అభియోగాలు ఎదుర్కొన్న తర్వాత గత నెలలో సస్పెండ్ అయ్యారు. బాధితుల్ని ప్రభావితం చేసేందుకు ఆమె వారికి మత సాహిత్యం, వీడియోలు, ఇస్లామిక్ కంటెంట్ను పంపినట్లు విచారణలో తేలింది.
