Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉన్న పోరు ఇప్పుడు టీవీకే రూపంలో స్టార్ యాక్టర్ విజయ్ రావడంతో ముక్కోణపు పోటీగా మారింది. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోసారి, డీఎంకే అధికారంలోకి వస్తుందని ‘‘లోక్ పోల్’’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Read Also: Pakistan: పాకిస్తాన్కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 40.1 శాతం ఓట్ల వాటాతో మొత్తం 234 స్థానాలకు గానూ.. 181 నుండి 189 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య ఈ సర్వే జరిగింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 29 శాతం ఓట్లతో 38-42 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది.
కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8-10 సీట్లు సొంతం చేసుకుంటుందని సర్వే చెప్పింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్కే మెజారిటీ ప్రజలు మద్దతు తెలిపారు. తర్వాత స్థానాల్లో విజయ్, పళనిస్వామి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ వంటి సంక్షేమ పథకాలు డీఎంకేకు ప్లస్గా మారినట్లు సర్వే చెప్పింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలను ఈ పథకాలు బాగా ఆకట్టుకున్నాయని, ఇదే డీఎంకేకు మద్దతు ఇస్తుందని లోక్పోల్ సర్వే చెప్పింది. ఇదే కాకుండా టీవీకే, అన్నాడీఎంకే మధ్య ఓట్లు చీలిపోవడం కూడా డీఎంకేకు ప్లస్ అవుతుంది.
